లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏముహూర్తంలో షూటింగ్ వర్మ మొదలు పెట్టాడో విడుదల వరకు అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ప్రాంతాల్లో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. ఏపీలో ఎన్నికలు ముగిసిన నేపధ్యంలో సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యిందని అంతా భావించారు.మే 1న సినిమా విడుదల కావాల్సిఉంది. అయితే తాజాగా సినిమా విడుదలకు షాక్ తగిలింది.
గతంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల నిలుపుదలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పూలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది. సినిమా విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఎలాంటి తాజా ఉత్తర్వులు తమకు అందలేదని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపించామని తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం సినిమా విడుదలను ఆపుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న మే 27 వ తేది వరకు ఉంటాయని ఎన్నికల అధికారి ద్వివేది తెలిపారు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కొత్తగా సినిమా ప్రభావం చూపడానికి ఏముంటందనేది ఆసక్తికరంగా మారింది. రేపు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల లేనట్టే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై వర్మ స్పందించలేదు.