మోహన్బాబు, కొరటాల శివ ట్విటర్లో విసుర్లు
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చెప్పించింది. హోదా ఇవ్వలేమని చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఊరించి ఊరించి ఇప్పుడు ఇవ్వలేమని తేల్చడంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వాళ్లంతా మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పలువురు స్పందించారు. ప్రముఖ నటుడు మోహన్బాబు, దర్శకుడు కొరటాల శివ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ట్విటర్లో విమర్శించారు.
మోహన్బాబు: ‘ఆంధ్రప్రదేశ్ పట్ల సవతి తల్లి తీరు ఎందుకు? ఏపీ ఏం తప్పు చేసింది? ప్రత్యేక హోదా గురించి ఏం జరుగుతోంది? ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని తెలంగాణ కూడా మద్దతు తెలుపుతోంది. ఇది ఏపీ సెంటిమెంట్ మాత్రమే అని అనుకుంటున్నారా?’ అని ట్వీట్ చేశారు.
కొరటాల శివ : ‘ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గుర్తుచేద్దాం. తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో ఓ భాగమేనని మీరు నిజంగానే భావిస్తున్నారా మోదీజీ?’ అని ప్రశ్నించారు.