చిన్న సినిమా అయినా.. ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పెద్దగా పబ్లిసిటీ చేయకపోయినా వసూళ్లతో బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.60 కోట్ల దాకా రాబట్టిందని… ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు.
ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. రోజురోజుకూ వసూళ్లు పెరుగుతున్నాయి. సినిమా విడుదలైన తొలి రోజు మార్చి 11న మూడున్నర కోట్లు రాగా.. రెండో రోజు రూ.8.50 కోట్లు, మూడో రోజు రూ.15.10 కోట్లు, నాలుగో రోజు రూ.15.05 కోట్లు వచ్చాయి. ఇక ఐదో రోజు ఏకంగా రూ.18 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా రూ.60.20 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కలెక్షన్ల స్పీడ్ చూస్తుంటే వందకోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమానే ఈ ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించారు. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.