ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం రేగింది. తిరుమలలోని రూ.300 ప్రత్యేక దర్శన క్యూలైన్లో నిల్చున్న ఓ భక్తురాలిని పాము కాటేసిన ఘటన ఆందోళన కలిగించింది. తెలంగాణకు చెందిన మౌనిక (27) అనే యువతిని అకస్మాత్తుగా పాము కాటేయడంతో అక్కడి భక్తులు భయాందోళనకు గురయ్యారు.
సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను సమీపంలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, మెరుగైన వైద్యం అవసరమని సూచించారు. దీంతో ఆమెను తిరుపతిలోని పెద్ద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనతో క్యూలైన్ ప్రాంతాల్లో భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శుభ్రత, పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరుతున్నారు. అధికారులు ఘటనపై విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
