తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో కంటే అసెంబ్లీ స్థానాలు పెరగడంతో పాటు ఓటు షేరింగ్ కూడా మెరుగు పడింది. ఇక ఓటమి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బీజేపీ నేతలు రానున్న లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు.
ఇక సీనియర్ నేతలంతా ఇప్పటికే పోటీచేసే స్థానాలపై ఖర్చీఫ్ వేసుకుని ఉన్నారు. కరీంనగర్ నుండి బండి సంజయ్, మెదక్ నుండి రఘునందన్, సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి,నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ దాదాపు ఖరారు కాగా మిగిలిన జనరల్ సీట్లలో పోటీ మాత్రం పెరిగిపోతోంది.
ప్రధానంగా బీజేపీ నేతలంతా మల్కాజ్గిరి ఎంపీ స్థానంపై దృష్టి సారించారు. సెటిలర్ ఓట్లతో పాటు చదువుకున్న వారు ఎక్కువగా ఉండటంతో ఈ స్థానం అయితే సెఫేస్ట్ ప్లేస్ అని భావిస్తున్నారు. అందుకే బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్ రావుతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్, పేరాల చంద్రశేఖర్,మాజీ ఎమ్మెల్సీ రామ్చందర్రావు,ఆకుల రాజేందర్,వీరేందర్ గౌడ్ పోటీ పడుతున్నారు. వీరిలో టికెట్ ఎవరికి దక్కుతుందోనని బీజేపీ క్యాడర్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇక జహీరాబాద్ నుం డి క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తో పాటు మాజీ ఎంపీ బాగారెడ్డి తనయుడు జైపాల్ రెడ్డి, ఆలే భాస్కర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ మల్కాజ్గిరి సీటు దక్కకపోతే జహీరాబాద్ నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈటల. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ సైతం బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నాయి.