తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సమరం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాన పార్టీలన్ని ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతుండగా మరోవైపు నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక బీజేపీ నుండి ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, డి.కె.అరుణ లాంటి ప్రముఖ నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే 14 స్థానాలు గెలుస్తామని చెబుతున్న బీజేపీ నేతలు ఇంకా నలుగురు అభ్యర్థుల బీఫామ్లు బీజేపీ పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత, మహబూబాబాద్ అభ్యర్థి సీతారాంనాయక్, నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డి, పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్లకు ఇంకా బీ ఫామ్ ఇవ్వలేదు. పెద్దపల్లిలో సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ బీజేపీలో చేరితే ఆయనకే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నల్గొండలోనూ బీఆర్ఎస్కు రాజీనామా చేసిన తేరా చిన్నపరెడ్డి బీజేపీలో చేరితే ఆయన అభ్యర్థిత్వం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా నలుగురు బీజేపీ అభ్యర్థుల బీ ఫామ్ పెండింగ్లో పెట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.