అంత అనుకున్నట్లే జరిగింది. రాజకీయాల నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు టీడీపీ సీనియర్ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. మీడియా సమావేశంలో మాట్లాడిన గల్లా…2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇకపై పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండనని తెలిపారు.
ఇక నుండి పూర్తిస్థాయిలో వ్యాపారాలపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు. తనకు ఇంతకాలం సహకరించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని,ఒకవేళ ఆ తర్వాత అవకాశం వస్తే తిరిగి పోటీ చేసే విషయంపై ఆలోచిస్తానని తెలిపారు.
రాజకీయాల్లో నా పని పూర్తిగా నిర్వర్తించలేక పోతున్నానని, ప్రజల్లో ఎక్కువ సమయం ఉండలేక పోతున్నానని చెప్పారు. పార్లమెంట్ లో మౌనంగా కూర్చోవడం నావల్ల కాదని అందుకు తప్పుకుంటున్నానని తెలిపారు. రాజకీయం, వ్యాపారం రెండు చోట్ల ఉండలేను అందుకే రాజకీయాల నుండి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు. ఎంపీగా రాష్ట్రంలో పలు సమస్యలపై, ప్రత్యేక హోదా విషయంపై, రాజధాని అంశంపై గళమెత్తానని తెలిపారు. సీబీఐ, ఈడీ నా ఫోన్ లు ట్యాప్ చేస్తున్నాయని తెలిపారు.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలుపొందారు గల్లా. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్. అమరరాజా బ్యాటరీస్ కంపెనీతో పాటు ఇతర వ్యాపారాలుకూడా ఉన్నాయి.