గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన సంగతి తెలిసిందే. 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలిచిన గల్లా…ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అంతా భావించగా ఎవరూ ఊహించని విధంగా తాను పోటీ చేయనని కొద్దిరోజుల క్రితమే చెప్పేశారు.
ఇప్పటికే తన వ్యాపారాలను తెలంగాణ, తమిళనాడు తరలించేందుకు ఏర్పాటు చేయగా ఈ నెల 28న కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తన రాజకీయ జీవితానికి ముగింపేనా అన్నదానిపై ఆ రోజే క్లారిటీ ఇవ్వనున్నారు. అదే రోజు లోకేష్తో భేటీ, ఓ ఫంక్షన్ హాల్లో టీడీపీ నేతలు,కేడర్కు విందు ఇవ్వనున్నారు. దీంతో ఈ విందు తర్వాత గల్లా ఏం చెప్పబోతున్నారు అన్నదానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వరుసగా రెండు సార్లు గుంటూరు నుండి ఎంపీగా గెలిచారు గల్లా జయదేవ్. వైసీపీ ప్రభంజనంలోనూ విజయం సాధించారు. ఇక రెండోసారి గెలిచిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్పై అంత దృష్టి సారించలేదు. అటు జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి సైతం టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. ఇక ఒకానొకదశలో జయదేవ్ వైసీపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటికి ఈ నెల 28న పుల్ స్టాప్ పడనున్నట్లు తెలుస్తోంది. మరి గల్లా ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో వేచిచూడాల్సిందే.