చంద్రబాబు అంటే దగా…దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటే వివాహ వ్యవస్థకే మచ్చ అని మండిపడ్డారు సీఎం జగన్. అనకాపల్లి వేదికగా వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులు రూ.5,060.49 కోట్ల సాయాన్ని విడుదల చేశారు. ఒక్కో లబ్ధిదారు ఖాతాలో రూ.18,750 చొప్పున నగదు జమ చేయగా ఈ సందర్భంగా జగన్ మరోసారి చంద్రబాబు అండ్ కో పై మండిపడ్డారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చంద్రబాబు మాట్లాడారు…చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది మోసాలే అన్నారు. పొదుపు సంఘాలకు చేసిన దగా ఎప్పటికి మర్చిపోలేమన్నారు. పవన్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తారని …కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తారంటూ చురకలు అంటించారు.
వైసీపీ సర్కార్ అంటే మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు. అమ్మ ఒడి పథకంతో 53 లక్షల మంది తల్లులకు అండగా నిలిచామన్నారు. 31 లక్షల ఇంటి స్థలాలు అందించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చేశామని…నవరత్నాల్లో ఇచ్చిన హామీల మేరకు అన్ని పథకాల అమలు పూర్తి చేశామన్నారు.