ఆంధ్రప్రదేశ్లో పాలన పూర్తిగా గాడి తప్పిందని ఆరోపిస్తూ, రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్లకు లేఖ రాశారు. రాష్ట్ర పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయని, శాంతిభద్రతలు క్షీణించాయని లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్న ఈ తరుణంలో, ప్రధాని జోక్యం చేసుకుని రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు.
ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ముద్రగడ ఆరోపించారు. ముఖ్యంగా మాజీ మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు, జోగి రమేశ్లను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులపై ఈ తరహా దాడులు, కేసులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తోందని, విపక్ష నేతలకు రక్షణ లేకుండా పోతోందని విమర్శించారు. పోలీసు వ్యవస్థను రాజకీయంగా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ, ఇది ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తోందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ పరమైన పాలన పునరుద్ధరించాలంటే కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ముద్రగడ పద్మనాభరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
