టీడీపీ – జనసేన పొత్తులో కొత్త ట్విస్ట్. ఇప్పటివరకు టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకం ఖరారైందని జనసేనకు 30 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ స్థానాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగగా దీనిని జనసేన నేతలు ఖండించారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశంలో నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ స్థానాలు తగ్గకుండా పోటీచేయాలని పవన్కు సూచించారు.
40కి తగ్గకుండా పోటీ చేస్తేనే చెప్పుకోదగ్గ స్థానాలు వచ్చే అవకాశం ఉందని నేతలు తేల్చిచెప్పారట. అయితే దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకుంటారా లేదా అన్న విషయం పక్కన పెడితే జనసేన నేతలు మాత్రం చాలా నియోజకవర్గాల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.
అంతేగాదు ఒకడుగు ముందుకేసి జనసేన పక్కాగా గెలిచే స్థానాలపై ఒక అంచనాకు వచ్చారని తెలుస్తోంది. జనసేన గెలిచే స్థానాలు ఇవేనంటూ ఆ పార్టీ నేతలు మీడియా ద్వారా లీకులు ఇస్తుండగా వాటిలో రాజమండ్రిరూరల్, కాకినాడ సిటీ/ రూరల్, నరసాపురం, అనంతపురం అర్బన్, ప్రత్తిపాడు (గుంటూరు), విశాఖ ఉత్తరం, విజయనగరం, బొబ్బిలి, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, నంద్యాల, పత్తికొండ , తాడేపల్లిగూడెం, ఏలూరు, కావలి, తిరుపతి, పుట్టపర్తి, చిత్తూరు, మాచర్ల, సత్తెనపల్లి, నరసరావుపేట, దర్శి ఉన్నాయి.
ఈ స్థానాల్లో టీడీపీ నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. అసలు ఈ స్థానాలను జనసేనకు ఇస్తారా అనేది అనుమానం కాగా జనసేన నేతలు గెలిచే స్థానాలు ఇవేనంటూ ప్రచారం చేసుకోవడం మాత్రం విశేషం.