ఆర్డీటీ సంస్థ పరిరక్షణ కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ప్రకటించారు. మార్చి 10న కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ఈ వివరాలు వెల్లడించారు.
అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆర్డీటీ ఒక వరమని పేర్కొన్నారు. గ్రామీణ పేదల అభ్యున్నతి, విద్య, వైద్యం, క్రీడలు, మహిళా సాధికారత వంటి రంగాల్లో ఆర్డీటీ విశేష సేవలు అందించిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంస్థ సేవలు విస్తరించాయని గుర్తుచేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ చేయకపోవడంతో సంస్థ కార్యకలాపాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. గతంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఆర్డీటీ సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని, ఆస్తులు అమ్ముకునే దశకు చేరుకుందని అన్నారు. ఇక్కడ ఆర్డీటీ లేకపోతే సంస్థకన్నా ప్రజలకే పెద్ద నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. అందుకే ‘సేవ్ ఆర్డీటీ’ పేరుతో లక్ష మందితో పోస్టుకార్డులు ప్రధాని నరేంద్రమోదీకి పంపించే ఉద్యమాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు.
తలారి రంగయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్ నుంచి ఆర్డీటీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని తెలిపారు. ఆర్డీటీ ఒక కులం, మతానికి సంబంధించినది కాదని, ప్రాంత ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్న సంస్థ అని చెప్పారు. మార్చి 10న నాలుగు భాషల్లో లక్ష పోస్టుకార్డులు పంపే కార్యక్రమంతో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని, అప్పటిలోగా ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ చేసి ఖాతాలపై ఫ్రీజ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
