వైసీపీ నేతలపై కూటమి నేతల అధికార దుర్వినియోగం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు లిక్కర్ కేసు మరోవైపు వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు వైసీపీ నేతలకు వరుస నోటీసులు ఇస్తున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజినికి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ రెంటపాళ్లకు చేసిన పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి భారీగా జన సమీకరణ జరిపారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో రజినిని విచారణకు పిలుపిస్తూ ఈ నెల 20న హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.
తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు సత్తెనపల్లి పోలీసులు. జగన్ రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించారని అంబటిపై కేసు నమోదు చేయగా జులై 21న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు.
అలాగే లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామికి నోటీసులు ఇచ్చింది సిట్. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు సిట్. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు నారాయణ స్వామి. ఇప్పటికే ఈ కేసులో 49 మందిని నిందితులుగా చేర్చింది సిట్.
