ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా వైసీపీ దూకుడు మీదుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చగా ఇక టీడీపీ – జనసేన సైతం ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా పవన్ పార్టీ పోటీ చేసే స్థానాలు, సీట్ల సంఖ్య దాదాపు ఖరారు కావడంతో ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి ఈ రెండు పార్టీలు.
మొదటిజాబితాలో దాదాపు 70 మంది అభ్యర్ధుల జాబితాను రిలీజ్ చేయనుండగా ఇందులో టీడీపీ తరపున 50 , జనసేన తరపున 20 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పొత్తులో భాగంగా 60 అసెంబ్లీ,8 లోక్ సభ స్థానాలకు జనసేన పట్టుబట్టగా చంద్రబాబు 25 అసెంబ్లీ, 2 లేదా 3 పార్లమెంట్ స్ధానాలు ఇవ్వటానికి అంగీకరించినట్లు సమాచారం.
అయితే కొన్ని స్థానాల్లో టీడీపీ- జనసేన మధ్య పంచాయితీ నడుస్తునే ఉంది. ప్రధానంగా రాజమండ్రి రూరల్ సీటుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నారు. పవన్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కందుల దుర్గేష్ రూరల్ నియోజకవర్గం నుండి పోటీచేయాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. అయితే టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండటంతో దీనిపై ఎటూ తెల్చుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ నెల 21న టీడీపీ – జనసేన ఫస్ట్ లిస్ట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.