ఆ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. 2009లో ఏర్పాటైన ఆ నియోజకవర్గం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ జెండానే రెపరెపలాడింది. కానీ 2009 తర్వాత ఓ సారి గెలిచిన పార్టీ అభ్యర్థి రెండోసారి గెలవలేకపోయారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటనుకుంటున్నారా విశాఖ నార్త్. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలవగా ఆ తర్వాత బీజేపీ,2019లో కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఈ సీటును కొల్పోయింది వైసీపీ.
ఇక ఈ సారి కూడా పోరు ఆసక్తికరంగా మారింది. వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు,టీడీపీ మద్దతుతో బీజేపీ నేత విష్ణుకుమార్రాజు, జైభారత్ నేషనల్ పార్టీ తరఫున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఇక టీడపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఈసారి భీమిలీ నుండి పోటీ చేస్తున్నారు.
3 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో క్షత్రియుల ఆధిపత్యం ఎక్కువ. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన కేకే రాజు ఈసారి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఓడినా ప్రజల్లో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా చూశారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిన కేకే రాజుపై నియోజకవర్గంలో సానుభూతి ఎక్కువగా కనిపిస్తోంది. సీఎం జగన్ అండదండలతో నియోజకవర్గంలో తనదైన మార్క్ చూపించారు. ఎవరికి సాయం కావాలన్న వెనుకడుగు వేయలేదు. అజాత శత్రువుగా నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్నారు రాజు. ఇక ఈసారి తన గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కూటమి పార్టీలపైనే ఆధారపడ్డారు. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలీలో ప్రచారం చేస్తుండగా వైసీపీ,టీడీపీలకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జేడీ లక్ష్మీ నారాయణ. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఈ సారి అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకున్నారు. విశాఖ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని చెబుతు ఓట్లు అడుగుతున్నారు. మొత్తంగా విశాఖ నార్త్లో జరుగుతున్న త్రిముఖ పోరులో ప్రజలు ఎవరికి పట్టం కడతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.