సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఎప్పుడు వివాదాల్లోనే మునిగితేలుతుంటారు. ఇక ముఖ్యంగా డ్రగ్స్ కేసు ఇండస్ట్రీ ప్రముఖులను ఎప్పుడు పట్టిపీడిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా బెట్టింగ్ యాప్ స్కామ్లో ఇరుక్కున్నారు నటులు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్లో బాలీవుడ్ నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్…ఆన్లైన్ బెట్టింగ్ యాప్. ఈ యాప్ కి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు భారీగా డబ్బులు తీసుకొని ప్రమోషన్స్ చేశారు. ఈ యాప్ అధినేతల్లో ఒకరైన సౌరభ్ చంద్రకర్ తన వివాహాన్ని దుబాయ్ లో 200 కోట్లతో ఘనంగా చేసుకున్నాడు. దీనికి టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, భారతి సింగ్, కృతి కర్బందా, నుశ్రుత్తో ఆపటు చాలామంది బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు.
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముసుగులో మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దీనిపై విచారణ ప్రారంభించింది. ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ తో సంబంధం ఉన్నవాళ్ళకి, దీనికోసం ప్రమోట్ చేసిన వాళ్ళకి ఈడీ నోటీసులు పంపించింది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్తో పాటు కపిల్ శర్మ, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్ వంటి వారున్నారు. మరికొంతమంది నటులకు ఈడీ నోటీసులు పంపనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు బాలీవుడ్లో ఈ బెట్టింగ్ స్కామ్ న్యూస్ హాట్ టాపిక్గా మారింది.