జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. ఈదుర్ఘటనలో మృతుల సంఖ్య 41 కి చేరింది. ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
30 మందికి పైగాతీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ ఆసుపత్రిక తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సు కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు. 33 మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వానికి తరలించారు. కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు కిందకు దిగుతున్న సమయంలో బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటుందనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది.
ఈ దుర్ఘటనపై తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
కొండగట్టు రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని ఆపద్ధర్మ రవాణ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కొండపై తొలిసారి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. తను ఘటనాస్థలికి బయలు దేరుతున్నానని, ఇప్పటికే జిల్లా అధికారులు, మంత్రి ఈటల రాజేందర్ అక్కడికి చేరుకున్నారని తెలిపారు.
