తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ఘోర దురద్రుష్ట సంఘటన చోటు చేసుకుంది. స్థానిక రాంపల్లి గ్రామంలోని నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ బిల్డింగ్ పైనుంచి ప్రమాదవశాత్తు పడి ఐదుగురు కూలీలు చనిపోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పదవ అంతస్తులో కార్మికులు పనులు చేస్తుండగా ఒక్కసారిగా గోవాకి కట్టిన తాళ్లు తెగాయి. దీంతో అక్కడ నిలబడి పనిచేస్తున్న నలుగురు మేస్త్రీలు కిందపడి ప్రాణాలు విడిచారు.
చనిపోయిన కార్మికులంతా జార్కండ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారు. చనిపోయిన నలుగురు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.15 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
మృతులను వారి స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. గోవా తాళ్లు తెగడంతో కూలీలు కింద పడిపోయారని.. ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.