ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు (డీ 6, డీ7) పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో రెండు బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో గ్వాలియర్ సమీపంలోని బిర్లానగర్ రైల్వేస్టేషన్ వద్ద చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. కాగా ఈ ప్రమాదం నుంచి 36మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.
ఈరోజు ఉదయం ఆరుగంటలకు ఢిల్లీలో ఏపీ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. గ్వాలియర్ ప్రాంతానికి సమీపిస్తున్న సయమంలో ఒక్కసారిగా ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ రెండు బోగీల్లో మంటలు వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
హైటెన్షన్ విద్యుత్ తీగలు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగాలోకో పైలట్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని, ఫైరింజన్లతో మంటలను ఆర్పివేసినట్లు రైల్వే పీఆర్వో మనోజ్ తెలిపారు. ఇందుకు సంబందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.