తన వ్యవసాయ క్షేత్రంలో గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి చేశారు గొర్ల కాపర్లు.కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దుశ్చర్ల సత్యనారాయణ.
సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిలో 15 ఏళ్లుగా కష్టపడి వేలాది మొక్కలను నాటి అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దారు పర్యావరణవేత్త, జల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ.
ఎందరో విద్యార్ధులు, పర్యావరణ వేత్తలు పరిశోధనలు చేస్తున్న ఈ అటవీ ప్రాంతంలో, చెట్లను నరికి గేదెలను, గొర్లను మేపుతున్నారు బయ్య గంగయ్య, మల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు. గోర్లను మేపుతుండగా అక్కడికి వెళ్లి అడ్డుకున్న సత్యనారాయణపై కుటుంబ సభ్యులతో కలిసి కర్రలతో దారుణంగా దాడి చేశారు గొర్ల కాపర్లు.
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తనపై దాడి చేసిన గంగయ్య, మల్లయ్య, రోషాలు, సుమలత, యశ్వంత్, అనూషలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు సత్యనారాయణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
