దేశంలో బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఊరట లభించింది. చాలాకాలంగా మొండిబకాయిల సమస్యతో సతమతమవుతున్న బ్యాంకులకు ఆర్ బి ఐ గతంలో కొన్ని నిబంధనలు విధించింది. దాదాపు 150 కంపెనీల రుణ బకాయిలకు కేటాయింపులు జరపాల్సిందిగా బ్యాంకులను ఆర్ బి ఐ ఆదేశించింది.
తాజాగా ఆ కంపోనీల నుంచి 24 కంపెనీలను తొలగిస్తూ బ్యాంకులకు వెసులుబాటు కల్పించింది. ఎన్నో చర్చోపచర్చల అనంతరం బుధవారం పొద్దుపోయిన తర్వాత దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేశారు. ఈ చర్యల వల్ల జనవరి – మార్చి నెలల మధ్య 24 కంపెనీల రుణ బకాయిలపై బ్యాంకులు ప్రోవిజనింగ్ చేయాల్సిన పని లేదు. దీని కారణంగా బ్యాంకులు క్యూ 4 ఫలితాల్లో లాభాలను పెంచుకునే వీలు కలుగుతుంది. వీటిలో కార్పొరేట్ కంపెనీలకు రుణలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకుల క్యూ 4 ఫలితాలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డిఫాల్ట్ అయిన కంపెనీల్లో ఆర్బీఐ తొలగించిన సంస్థల్లో జైప్రకాశ్ అసోసియేట్స్, కోస్టల్ ఎనర్జెన్ వంటివి ఉన్నాయి.
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న కంపెనీలు రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఆస్తుల విక్రయం వంటి చర్యలు తీసుకోవడంతో ఆర్ బి ఐ ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఆర్ బి ఐ ఇచ్చిన ఆదేశాల కారణంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబి:, ఐవోబి వంటి కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఆర్ బి ఐ తాజా నిర్ణయం కారణంగా వాటితో పాటు మరికొన్ని బ్యాంకులు కూడా లాభాల బాటలోకి వచ్చే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.