తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు బిగ్ షాక్ తగిలింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అభ్యంతరం చెబుతూ కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు ఏజీ అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని, అసెంబ్లీలో చర్చించాకే నివేదికపై ముందుకెళ్తామని సీజే ధర్మాసనానికి తెలిపారు.
అసెంబ్లీలో చర్చించిన తరువాతనే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఏజీ చెప్పిన నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
