ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చిరంజీవి.. తమ పార్టీ అధికారంలో లేకపోవడంతో తాత్కాలికంగా రాజకీయాలను పక్కన పెట్టి 150 వ చిత్రం ఖైదీ నెం 150లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే చిరు తాత్కాలికంగా రాజకీయాలను పక్కన పెట్టినట్లు కనిపిస్తున్నా..తన రాజకీయ భవిష్యత్తు గురించి ఓ నిర్ణయం తీసుకోవడానికి మాత్రం సీక్రెట్ గా మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మద్యన చిరంజీవి టిడిపిలో చేరుతారని, బిజెపిలో చేరుతారని జోరుగా వార్తలు వచ్చాయి.
వాటిని చిరంజీవి అప్పట్లో ఖండించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టంచేశారు. అయితే ఇటీవల పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి చేపట్టిన ఏ కార్యక్రమానికి చిరంజీవి హాజరుకాలేదు. దీనితో ఆయన కాంగ్రెస్ కు దూరమవుతున్నారన్న వార్తలు వచ్చాయి. కాగా ఇటీవల గుంటూరులో జరిగిన ఖైదీ నెం 150 చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బిజెపి నేత ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరుకావడంతో చిరు రాజకీయ భవిష్యత్తు పై జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. చిరంజీవి బిజెపి లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఖైదీ చిత్రం విడుదల తరువాత చిరు తన రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.