ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ను ఇవాలా అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. మొత్తం రూపాయలు 2 లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్ను సభకు సమర్పించారు. ఈ ఏడాదికిగాను ద్రవ్య లోటును రూ. 35వేల 260 కోట్లుగా, రెవెన్యూ లోటును రూ. 1778 కోట్లుగా బుగ్గన అంచనా వేశారు. బడ్జెట్లో నవరత్నాల పథకాలకు పెద్ద పీట వేశారు. అయితే ఈసారి రెండు కొత్త పథకాలను సీఎం జగన్ పేరును పెట్టారు.
బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలకు వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు బీమా అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పలు పథకాలకు పెట్టారు.
అయితే జగన్ పేరుతో రెండు పథకాలను తీసుకొచ్చింది ప్రభుత్వం.జగనన్న అమ్మ ఒడి’ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద స్కూలుకు పంపించే పిల్లల తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15వేలు వేస్తామని ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నవరత్నాలు పథకాల్లో ఈ పథకం ముఖ్యమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు పంపే విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింప జేయాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి బడ్జెట్లో రూ.6455 కోట్లు కేటాయించింది.
ఇక రెండో పథకం జగనన్న విద్యాదీవెన. జగనన్న అమ్మ ఒడి పథకంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కూడా జగన్ పేరును పెట్టింది ప్రభుత్వం. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ‘జగనన్న విద్యాదీవెన’ అనే పేరు పెట్టారు. ఈ పథకాలతో జగన్ తండ్రి వైఎస్లాగె ప్రజల మనస్సుల్లో నిలిచిపోనున్నారు.