విజయ్ మాల్కాకు కేంద్ర వత్తాసు
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో విహరిస్తున్న కింగ్ఫిషర్ పక్షి ఎవరో తెలియదంట. ఆయన చేసిన అప్పులు తమకు తెలియవని ఏకంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన అప్పులు ఎగ్గొట్టి వెళ్లారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కి ఆర్థిక శాఖ తెలిపింది. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు నివ్వెరపోతున్నారు.
ఈ ముచ్చట మన విజయ మాల్యా అప్పుల గురించే. రూ.వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని వ్యాపార సామ్రాజ్యాలు మాల్యా విస్తరించాడు. మద్యం, విమానయానం, హోటళ్లు, పబ్లు తదితర వ్యాపారాల్లో మునిగిన అతడు నష్టాలు రావడంతో మెల్లగా జారుకున్నాడు. రూ.వేల కోట్ల అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టడానికి విదేశాలకు పరారయ్యాడు. భారతదేశం విడిచివెళ్లిపోయాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాల్యా విదేశాలకు చెక్కేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో అది నిజమేనని అనిపిస్తోంది.
విజయ్ మాల్యా అప్పులకు సంబంధించి వివరాలు కావాలని ఆర్టీఐ కార్యకర్త రాజీవ్కుమార్ ఖరే సమాచార హక్కు చట్టం కింద ఆర్థికశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మాల్యా అప్పుల వివరాలు తాము ఇవ్వలేమని, వ్యక్తిగత భద్రత, దేశ ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే వివరాలు ఇవ్వకుండా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లో కొన్ని మినహాయింపులు ఉన్నాయంటూ ఆర్థిక శాఖ తెలిపింది. ఇది ఒక సాకుగా చూపిస్తూ తప్పించుకుంది.
ఆర్థిక శాఖ వైఖరితో ఖంగుతతిన్న రాజీవ్ కుమార్ ఖరే సమాచార హక్కు కమిషన్ను ఆశ్రయించాడు. కమిషన్.. ఆర్థిక శాఖను వివరాలు కోరగా తిరిగి అదే సమాధానం వచ్చింది. మాల్యా అప్పులకు సంబంధించిన రికార్డులేవీ తమ దగ్గర లేవని, దరఖాస్తుదారుడు కోరుతున్న సమాచారం ఆయా బ్యాంకులు లేదా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండొచ్చని చెప్పింది.ఆర్థికశాఖ సమాధానంపై సమాచార హక్కు కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టప్రకారం ఇది అస్పష్టమైన, అస్థిరమైన జవాబు అంటూ నిరసన వ్యక్తం చేసింది. రాజీవ్ దరఖాస్తును సంబంధిత పబ్లిక్ అథారిటీకి బదిలీ చేయాలని సూచించింది.