మధ్యాహ్నం ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ప్రజలు అఖండవిజయాన్ని కట్టబెడితే మరో వైపు జగన్ ప్రమాణస్వీకారాన్ని ప్రకృతి కూడా స్వాగతించింది. బుధవారం అర్ధరాత్రి విజయవాడలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగులు విరిగిపడ్డాయి. ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. ఏపీ రెండో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో వేదిక పైకప్పు పాక్షికంగా దెబ్బతింది.
భారీ వర్షం కురిసినప్పటికి జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇబ్బందులు రాకూడదని అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ, భగవంతుడి ఆశీర్వాదమని, కరవు పోయి, నేల సస్యశ్యామలం అవుతుందని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏదేమైనా గాని వర్షం రావడం రాష్ట్రానికి మంచి శుభ సూచకంగా భావిస్తున్నారు పార్టీ నాయకులు.