వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. కెఇ కృష్ణమూర్తి కొడుకు కెఇ శ్యాంబాబు అరెస్టుకు రంగం సిద్ధమైంది. నారాయణరెడ్డి హత్య కేసులో శ్యాంబాబు అరెస్టు తప్పదని తేలిపోయింది. పోయిన నెలలలోనే శ్యాంబాబు అరెస్టుకు హైకోర్టు ఉత్తర్వులిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
వివరాల్లోకి వెల్తే పత్తికొండ వైసీపీ ఇన్ ఛార్జ్గా ఉన్న చెరుకులపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్థులు హత్యచేశారు. నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తిని అతి కిరాతకంగా హత్యచేసిన శ్యాంబాబు అనుచరులు అటు తరువాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి చార్జీషీట్లో పేర్లు తొలగించుకోవడం పట్ల నారాయణరెడ్డి భార్య శ్రీదేవి తీవ్ర అభ్యంతరం చేస్తూ… నిందితులుగా కేఈ శ్యాంబాబుతో పాటు ఆస్పరి జెడ్పీటీసీ కప్పెట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్లను తన భర్త హత్యకేసులో ముద్దాయిలుగా చేర్చాలని పేర్కొంటూ కర్నూలు జిల్లా డోన్ కోర్టులో శ్రీదేవి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు, బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్ఐ నాగప్రసాద్లను నిందితులుగా చేర్చాలని సూచించింది.
అయితే తన అరెస్టుపై స్టే తెచ్చుకునేందుకు శ్యాంబాబు చాలా ప్రయత్నాలే చేశారు. కాని అవేవి ఫలించలేదు. కేసును విచారించిన కోర్టు బుధవారం అరెస్టుపై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. దాంతో స్టే ఆఫ్ అరెస్టు సౌకర్యం శ్యాంబాబుకు దొరకలేదు. కాబట్టి గురువారం కోర్టులో లొంగిపోయే అవకాశాలున్నాయి. వెంటనే కోర్టు ద్వారా శ్యాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.