తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు వ్యవహారంలో సేఫ్ జోన్లోకి వచ్చినట్టే అంటున్నారు ఆయన అభిమానులు. తెలంగాణ లో నమోదైన ఈ కేసులో చంద్రబాబు కు ఇబ్బందులు తప్పవని..
ఆయనకు ఏసీబీ నోటీసులు ఇస్తుందని.. జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కూడా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఓటుకు నోటు వ్యవహారంలో అంత వేడి లేదు! వ్యవహారం చల్లారిపోయినట్టుగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసిన వ్యవహారంలో బాబుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఆయన అభిమానులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ అధినాయకుడిని ఏమీ చేసుకోలేకపోయిందని వారు గట్టిగా చెబుతున్నారు. మరి బాబు నిజంగానే సేఫ్ జోన్లోకి వచ్చారా? తెలంగాణ సీఎం కేసీఆర్ బాబును ఏమీ చేయలేకపోతున్నాడా? అనే సందేహాలు నెలకొన్నాయిప్పుడు.
అయితే ఏసీబీ మాత్రం ఈ వ్యవహారం గురించి ఇంకా కసరత్తు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. పక్కా ఆధారాలతోనే బాబుకు నోటీసులు ఇవ్వాలని.. ఏసీబీ భావిస్తోందట. అయితే ఇప్పటికే ఓటుకు నోటు వ్యవహారం వెలుగులోకి వచ్చి మూడు వారాలు గడిచిపోయాయి. ఇంకా ఏసీబీ కసరత్తులే చేసుకొంటూ ఉంటే.. బాబుకు నోటీసులు ఇచ్చేదెప్పుడు? అనేదానికి సమాధానం లేకుండాపోయింది. దీంతో బాబు నిజంగానే సేఫ్ జోన్లోకి వచ్చాడేమో అనుకోవాల్సి వస్తోంది. మరి బాబు ఏం చేసి సేఫ్ జోన్లోకి వచ్చాడనేది ఇంకో మిస్టరీ. ఇంతకీ అసలు కథ ఏమిటో తేలాలంటే కొంత కాలం వేచి చూస్తే కానీ అర్థం కాదు.