- నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం
- ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న రాజ్యాంగం
ప్రపంచంలో ఉత్తమ రాజ్యాంగం అంటే అది మన దేశానిదే. ప్రపంచానికే పాఠాలు నేర్పే గొప్ప గ్రంథంగా భారత రాజ్యాంగం నిలుస్తోంది. అన్ని దేశాల నుంచి మంచి విషయాలు తీసుకొని గొప్ప రాజ్యాంగంగా రూపుదిద్దుకుంది. కొందరు అతుకుల బొంత అని అంటారు. ఆ అతుకుల బొంతనే ప్రజలకు పెద్ద పీట వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగం మనదే. భారతదేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అభివర్ణించడానికి రాజ్యాంగమే కారణం. దేశంలో ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతుల సమ్మేళనమే భారత రాజ్యాంగానికి ఉన్న గొప్ప లక్షణం. ఎన్ని వర్గాలు ఉన్నా చివరికి మనమంతా భారతీయులమనే ఒక్క మాట చాలు దేశాన్ని శాంతియుతంగా నిలపడానికి. అలాంటి అవకాశం కల్పించింది భారత రాజ్యాంగం. నవంబర్ 26వ తేదీ భారత రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్కు అందజేసిన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదం తెలిపింది. ఈ ఏడాదితో భారత రాజ్యాంగానికి 68 ఏళ్లు. ప్రపంచ దేశాల రాజ్యాంగాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మన రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దార్శనీయకత నేటికి సజీవంగా ఉంది.
1947 ఆగస్ట్ 29వ తేదీన ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా సంఘాన్ని ప్రకటించారు. చైర్మన్గా అంబేడ్కర్ నియమితులయ్యారు. మిగతా సభ్యులుగా పండిట్ వల్లభాయి పంత్, కె.ఎం మున్షీ, కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగార్, మహ్మద్ సాదుల్లా, డి.పి. కైతాన్ ఉన్నారు. కైతాన్ ఆకస్మిక మరణంతో టి.కృష్ణమాచారిని ఆ స్థానంలో నియమించారు. సలహాదారులుగా బి. నర్సింగరావును నియమించారు. ఈ సంఘం రాజ్యాంగాన్ని రూపొందించింది.
తొలి నాళ్లలో 395 నిబంధనలు 8 షెడ్యూళ్లు ఉన్న రాజ్యాంగం తర్వాత కాలంలో 450 నిబంధనలు 12 షెడ్యూళ్లు అయ్యాయి. రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని ప్రకరణలతో పాటు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ఈ రోజుకే కాదు… ఏనాటికైనా పురోగమనానికి మార్గదర్శకలుగా ఉంటాయి.
రాజ్యాంగ సభ 11సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాతప్రతిపై వెచ్చించింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. ప్రపంచంలో అత్యంత విశిష్ట స్థానాన్ని సంపాదించిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవడానికి ఇప్పుడు ఒక రోజును కేటాయించారు. అదే మన రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రతి సంవత్సరం అందరూ రాజ్యంగం విశిష్టితను దానిని రూపొందించాడినికి జరిగిన కృషిని గుర్తు చేసుకుంటారని ఆశిద్దాం.
