రాజకీయాలు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి రాజకీయాలు చేయడంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. బయటికి చూపించే సినిమా ఒకటి ఉంటుంది. వాస్తవంగా జరిగే సినిమా మాత్రం ఇంకొకటి ఉంటుంది. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన సమయం……..అంతకు ముందు కూడా చంద్రబాబు ఎప్పుడూ చేసిన రాజకీయాలు ఇవే. ఎన్టీఆర్కి నమ్మకమైన భక్తుడిలా ఉంటూ ఆయనకే వెన్నుపోటు పొడిచాడు. తన చేతుల మీదుగానే ఎన్టీఆర్-లక్ష్మీపార్వతిల పెళ్ళి జరిపించిన చంద్రబాబు అదే పెళ్ళిని సాకుగా చూపించి ఎన్టీఆర్కి ఆయన కొడుకులను దూరం చేశాడు చంద్రబాబు. అదే లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఏకంగా ఎన్టీఆర్ పార్టీని, అధికారాన్ని కూడా లాక్కున్నాడు. ఆ దిగులుతో ఎన్టీఆర్ చనిపోయాడన్నది వాస్తవం.
విభజన సమయంలో కూడా టిడిపిని, తన రాజకీయ భవిష్యత్ని నాశనం చెయ్యడానికే విభజన చేస్తున్నారని ప్రజలకు సినిమా చూపించాడు. తెరవెనుక మాత్రం ఎంచక్కా సోనియాతో కలిసిపోయి, చీకట్లో చిదంబరంతో రాజకీయాలు చేసి విభజనకు పూర్తిగా మద్దతిచ్చాడు. ఇప్పుడు సిఎం రమేష్ విషయంలో కూడా అదే రాజకీయం చేస్తున్నాడని న్యాయశాఖ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణాలో కెసీఆర్ని ఓడించడానికి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును కేసీఆర్ వదిలే ప్రసక్తే లేదు. ఓటుకు కోట్లు కేసులో బాబు ఇరుక్కోవడం ఖాయం కనుక……… ఆ ఆపద నుంచి తాను బయటపడడానికి తెర వెనుక వ్యవహారం అంతా సిఎం రమేష్ చేశాడు అని పాపం మొత్తాన్ని సిఎం రమేష్కి అంటగట్టాలని చూస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టిడిపికి రాజగురువులాంటి మీడియా అధినేత ఈ వ్యూహం రచించాడట.
ఓటుకు కోటు కేసు విషయంలో దొరికిపోయిన యాభై లక్షలు, దొరకని కోట్లాది రూపాయలతో చంద్రబాబుకు ఏమీ సంబంధం లేదు అని నిరూపించేలా ……… ఆ డబ్బు మొత్తానికి బాధ్యుడిగా సిఎం రమేష్ని ఇరికించే ప్రయత్నాలు పచ్చ బ్యాచ్ షురూ చేసిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలే ఈ మధ్య సిఎం రమేష్కి చంద్రబాబుకి మధ్య విభేదాలు ఉన్నాయి. కడప జిల్లాలో కూడా టిడిపి స్థానిక నాయకులతో సిఎం రమేష్కి విభేదాలు ఉన్నాయి. రాజ్యసభ సీటు విషయంలో కూడా సిఎం రమేష్ని చివరి వరకూ ఇబ్బందిపెట్టారన్నది నిజం. ఈ నేపథ్యంలో బాబును బయటపడెయ్యడం కోసం సిఎం రమేష్ని బలిచేస్తున్నారు అన్న అభిప్రాయాలను టిడిపి సీనియర్ నేతలు కూడా ఆఫ్ ది రికార్డ్గా చర్చించుకుంటుండడం వాస్తవ పరిస్థితిని తెలియచేస్తోంది. చంద్రబాబుపై స్వయంగా టిడిపి నాయకులకు ఎవ్వరికీ నమ్మకం ఉండదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ భయాలు టిడిపి నాయకుల్లో ఇంకా పెరిగిపోతున్నాయని ఆ పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు.