సరిగ్గా నెల కిందట ప్రధానమంత్రి నరేంద్రమోడీ సీషెల్స్ , శ్రీలంక వంటి దేశాల పర్యటనకు వెళ్లాడు.
నెల అలా గడిచిందో లేదో.. ఆయన ఫ్రాన్స్ , జర్మనీ, కెనడా వంటి దేశాల పర్యటనకు వెళ్లిపోయారు. అక్కడ వివిధ అంశాల గురించి ఆయాదేశాల వారితో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో దేశీయంగా వివిధ వర్గాల నుంచి మోడీపై తీవ్రమైన విమర్శలు చెలరేగుతున్నాయి.
తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మోడీపై విరుచుకుపడింది. విదేశీ పర్యటనలో ఉన్నమోడీపై ఆమె నిప్పులు చెరిగారు. అచ్చేదిన్ అంటూ అధికారంలోకి వచ్చిన మోడీ తొమ్మిది నెలల్లో సాధించింది ఏమీ లేదని.. ఆయన పాలనలో 11 విదేశీ పర్యటనలు కనిపిస్తున్నాయి తప్ప మరోటీ కాదని ఆమె ధ్వజమెత్తారు. ఆయన విదేశీ పర్యటనలు చేయడం వల్ల తనకు వచ్చే నష్టం లేదు, తనకు ఇబ్బంది లేదని.. అయితే ఆయన విదేశాల్లో విహరిస్తుంటే.. దేశాన్ని చూసుకొనేది ఎవరు? అంటూ మమతా దీదీ విమర్శలు చేసింది.
పనిలో పనిగా సీబీఐ తీరు గురించి, భూ సమీకరణల బిల్లు సవరణల చట్టం గురించి కూడా దీదీ విమర్శలు చేసింది. మోడీ సీబీఐ ని తనకు ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకొంటున్నాడని.. రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతున్నాడని దీదీ ఆరోపించింది. భూ సమీకరణ చట్టం గురించి కేంద్రం అబద్ధంచెబుతోందని.. ఈ విషయంలో అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని దీదీ వ్యాఖ్యానించారు.