టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షుతులపై మంత్రి సోమిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా తిరుమలలో జరుగుతున్న అవతకవకలపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
ఎవరా రమణ దీక్షితులు అంటూ సోమిరెడ్డి ఏకవచన ప్రయోగం చేశారు. రమణ దీక్షితుల్ని బొక్కలోకి తోసి.. నాలుగు తంతే నిజాలు బయటకు వస్తాయంటూ బెదిరింపులకు దిగారు. తిరుమల ఆలయంలో ఏం జరుగుతుందో.. అన్నీ తెలుస్తాయంటూ సోమిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు.
వెంకన్నతో పెట్టుకున్నవారు అనుభవిస్తారు, నాశనమైపోతారంటూ సోమిరెడ్డి శాపనార్థాలు పెట్టారు. హద్దుమీరి మాట్లాడుతున్నారంటూ బీజేపీ, వైసీపీలపై మండిపడ్డారు. వారికి అనుభవించే కాలం దగ్గర్లోనే ఉందని అన్నారు. ఆయనలాంటి వారి వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు.
టీటీడీ అంశాన్ని బజారుకెక్కించాలని ఆయన అనుకుంటున్నారని ఆక్షేపించారు. నాశనమైపోతారు.. చెత్త రాజకీయాలు పక్కనబెట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటే రమణ దీక్షితులకు అంత భయం లేకుండా పోతుందా? అని ప్రశ్నించారు.
దీక్షితులు ఏమేం తప్పులు చేశారో మొత్తం తమకు తెలుసునని అన్నారు. ‘రమణ దీక్షితులూ.. మీరు హద్దులు మీరి మాట్లాడుతున్నారు. రమణ దీక్షితులూ.. ఎన్నో రోజులు లేవు. అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టారు. ఇప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం అవుతున్నాయి.