- గ్లోబల్ సమ్మిట్కు రానున్న మానుషి చిల్లర్
తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమంతా ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు కోసం ఎదురుచూస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పర్యటనపై అందరిలో ఆసక్తి రేగుతోంది. అది పారిశ్రామిక వేత్తల సదస్సు అని తెలిసినా తాము కూడా పాల్గొంటున్న మాదిరి ప్రజలు ఫీలవుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఈ సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. దీంతో భాగ్యనగరం కొత్త సొబగులు సంతరించుకుంది. ఈ సదస్సు సందర్భంగా అభివృద్ధి పనులు ముమ్మరంగా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సదస్సుపైనే ఎక్కడ చూసినా ముచ్చట్లు.
అయితే ఈ సదస్సుకు ఇటీవల ప్రపంచ సుందరిగా నిలిచిన మన భారత బిడ్డ, హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ కూడా రాబోతోంది. ఈ సదస్సులో ప్రసంగించనుంది. ఆమె టైటిల్ నెగ్గిన తర్వాత తొలిసారిగా పాల్గొనేది ఈ సదస్సు కావడం విశేషం. ఈ సదస్సులో ఆమెతో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సదస్సులో మన తెలుగు రాష్ట్రానికి చెందిన వారు కూడా ప్రసంగిస్తున్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్, బాలీవుడ్ నటులు సోనమ్కపూర్, అదితీ రావు హైదరీ, టాలీవుడ్ స్టార్ రామ్చరణ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడే వారిలో ఉన్నారు. ఈ సదస్సులో మొత్తం 50కుపైగా చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి.