ఎన్నికలు ముగిసాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలేవో కూడా తేలిపోయింది. అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇక తేలనున్నది శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు అన్నదే. గతంతో పోలిస్తే ఈసారి డిఎంకెకు చాలా ఎక్కువ సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని తమ బలగంతో ఇబ్బంది పట్టేన్ని స్ధానాలను డిఎంకె గెలుచుకుంది.
అయితే శాసనసభలో తమ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే వారెవ్వరా అన్నదే ప్రశ్న. ఇన్నాళ్లు పార్టీని ముందుండి నడిపించిన 92 ఏళ్ల కరుణానిధి ప్రతిపక్ష నేత అవుతారా.. లేక అటు యువతరానికి, ఇటు పెద్దరికానికి మధ్య వారధిలా ఉంటే స్టాలిన్ ఆ పదవిని పొందుతారా అనేది ప్రస్తుతానికి ఉన్న సన్సెన్స్. పార్టీలో ఇతర సీనియర్లు, కొందరు నాయకులు మాత్రం కరుణానిధి అయితే జయలలితను శాసనసభలో మరింత ఇబ్బందుల పాలు చేస్తారని, ఆయనకున్న అనుభవం, ఇప్పుడున్న బలగంతో జయమ్మకు మూడు చెరువుల నీళ్లు తాగించవచ్చన్నది వారి వాదన.
అయితే మరికొందరు మాత్రం స్టాలిన్ అయితే సరికొత్త వ్యూహాలతో ముందుకెళతారని, భవిష్యత్ లో పార్టీని నడిపించేది ఆయనే కాబట్టి ఇప్పటి నుంచే స్టాలిన్ తన రాజకీయ పరిణితి చూపితే బాగుంటుందని మరికొందరి వాదన. ఈ తండ్రీకొడుకుల్లో ఎవరు ప్రతిపక్ష నేత అనేది మంగళవారం నాడు తేలనున్నది. జయలలిత ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మంగళవారం నాడు డిఎంకె ఎమ్మెల్యేలతో శాసనసభలో ప్రతిపక్ష నేత కోసం సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే ఎవరు నాయకుడనేది తేల్చేస్తారు.