కెరీర్ కొంచెం బాగున్నప్పుడే జల్సాలకు అలవాటుపడ్డాడు. ఆ జల్సాలు ఎక్కువడడంతో ఖర్చులకు డబ్బు చాలలేదు. ఇంకేం దొంగతనం బాట పట్టాడు. దర్జాగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఘరానా దొంగను పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. పట్టుబడిన తర్వాత అతడు ఎవరో తెలియడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. అయినా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
టీవీలో ‘పటాస్’ షో వస్తోంది. ఆ షోలో ఆర్టిస్టుగా ఉన్న బర్రి నాగరాజు అలియాస్ నరేందర్ అలియాస్ శ్రీకాంత్ అలియాస్ గుంటూరు నరేంద్రగా పోలీసులు గుర్తించారు. నరేందర్ను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని అంబేడ్కర్నగర్కు చెందిన బర్రి నాగరాజు అలియాస్ నరేందర్ అలియాస్ శ్రీకాంత్ అలియాస్ గుంటూరు నరేంద్ర (23) కార్పెంటర్గా పనిచేస్తుండేవాడు. సినిమాలో నటించాలనే కోరికతో హైదరాబాద్ వచ్చి జూబ్లీహిల్స్లోని ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ వద్ద నివసిస్తున్నాడు. ఓ ప్రైవేట్ తెలుగు టీవీ సీరియల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తున్నాడు. ‘పటాస్’ షోలో అవకాశం వచ్చింది. షోలో చేస్తూనే జూదం, సిగరెట్, మద్యానికి బానిసయ్యాడు. తన వ్యసనాలను తీర్చుకోవడం కోసం దొంగతనాల బాట పట్టాడు.
హైదరాబాద్లోని చైతన్యపురి, సరూర్నగర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి, పథకం ప్రకారం.. రాత్రిపూట కటింగ్ప్లేర్, స్ర్కూడ్రైవర్ను తీసుకెళ్లి ఇంటి తాళాలను విరగ్గొడతాడు. 2016 నుంచి ఇప్పటివరకు చైతన్యపురి పోలీస్టేషన్ పరిధిలో 16, సరూర్నగర్ పరిధిలో ఒకటి, మొత్తం 17 ఇళ్లను దోచాడు. అతడి వద్ద నుంచి 72.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 2015లో హుజుర్నగర్, విజయవాడలోని అరండల్పేటలోనూ ఆటోమైబైల్ దొంగతనాలు చేసినట్లు సీపీ వెల్లడించారు.