తెలుగుదేశం నేతల ప్రకటనల పట్ల మండి పడుతున్నారు పవన్ కల్యాణ్ అభిమానులు. అది కూడా తమ అభిమాన హీరో విషయంలో తెలుగుదేశం నేతలు సభా ముఖంగా చేసిన ప్రకటనలు వారికి కోపం తెప్పిస్తున్నాయి.
తెలుగుదేశం నేతలు నోళ్లను కొంచెం హద్దుల్లో పెట్టుకొంటే మంచిదని పవన్ అభిమానులు సూచిస్తున్నారు. జనసేన అధినేత పుట్టిన రోజు నాడు ఈ విధంగా పవర్ స్టార్ అభిమానులు అశాంతికి గురి అవుతుండటం విశేషం. మరి దీని వెనుక ఆసక్తికరమైన రీజనే ఉంది.
శాసనమండలిలో తెలుగుదేశం ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ చేసిన ప్రకటనే పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.. పవన్ కల్యాణ్ వల్ల తమ పార్టీ గెలవలేదని తేల్చేశాడు. తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా గెలిచింది తప్ప.. పవన్ వల్ల కాదని ఆయన స్పష్టం చేశాడు. దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీగెలుస్తుందని కూడా ఎవరూ ఊహించలేదని.. కేవలం జనసేన పార్టీని స్థాపించి తమ అభిమాన హీరో తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మద్దతు పలకడం వల్లనే పరిస్థితులు మారిపోయాయని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.
అయితే ఆ కృతజ్ఞత లేకుండా ఇప్పుడు తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారని, ఇప్పుడు ఏకంగా శాసనమండలిలోనే తెలుగుదేశం వారు ఇలాంటి ప్రకటన చేయడం దారుణం అని వారు అంటున్నారు. పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకొంటేనే తెలుగుదేశం పార్టీ గెలిచింది.. పవన్ మద్దతు ప్రకటించడంతోనే తెలుగుదేశానికి భారీ స్థాయిలో ఓట్లుపడ్డాయి.. అని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం అలాంటిది ఏమీ లేదంటూ.. పవనిజం ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.