భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా అసోం కు చెందిన జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ గొగోయ్చే 46వ చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేయించారు.
జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ న్యాయవాది అయిన గొగోయ్ 13నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. ఈశాన్యం నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి సీజేఐగా గగోయ్ చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతిభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు పాల్గొన్నారు.
జస్టిస్ గొగోయ్ ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు.1978లో అసోం(అప్పటి అస్సాం) బార్ అసోసియేషన్ లో చేరారు. 2001, ఫిబ్రవరి 28న గువాహటి హైకోర్టులో శాశ్వత జడ్జీగా నియమితులయ్యారు. 2009, సెప్టెంబర్ 10న పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరుసటి ఏడాది అదే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తాజాగా సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ గొగోయ్.. ఈ బాధ్యతల్లో 2019, నవంబర్ 17 వరకూ కొనసాగనున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి తన దగ్గర ఓ ప్లాన్ ఉందని గొగోయ్ చెప్పారు.