శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. అధ్యక్షుడు సిరిసేన, ప్రధాని విక్రమ్ సింఘే వివాదం రచ్చకెక్కింది. దీంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య రాజపక్సే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయగా. ..శనివారం ఆ వివాదం మరింత తీవ్రస్థాయికి చేరింది. అధ్యక్షుడు సిరిసేన ఏకంగా లంక పార్లమెంట్నే రద్దు చేయడం ఇప్పుడు హాట్టాపిక్ గా మారింది.
విక్రమ సింఘే ప్రధానిగా, సిరిసేన అధ్యక్షుడిగా 2015లో శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ సంకీర్ణంలో విబేధాల కారణంగా తాజాగా విక్రమ సింఘేను సిరిసేన తప్పించడంతో రాజపక్సే ప్రధాని అయ్యారు. మరోవైపు తనను పదవి నుంచి తొలగించే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉంది, అధ్యక్షుడికి కాదని విక్రమ సింఘే వాదిస్తున్నారు.
రాజపక్సే లంక ప్రధాని కావడం భారత్ను కలవరానికి గురి చేస్తోంది. గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ను పక్కనబెట్టి, శ్రీలంక చైనాకు దగ్గరైంది. హంబన్టోట పోర్టును డ్రాగన్కు లీజుకు ఇచ్చేందుకు నాటి రాజపక్సే సర్కారు అంగీకరించింది. కొలంబో పోర్టు నిర్మాణానికి చైనా ముందుకు రాగా.. బదులుగా అక్కడ ఆ దేశానికి చెందిన సబ్మెరైన్లను నిలపడానికి లంక ఓకే చెప్పింది. ఇది భద్రతాపరంగా తనకు ముప్పని భారత్ ఆందోళన చెందింది.
