ఎస్సీ, ఎస్టీ కులాల ప్రస్తావన సమయంలో.. ప్రభుత్వ పథకాలు, కార్యకలాపాల్లో దళితులు అని తరచూ వాడుతుంటాం. ఎస్సీ, ఎస్టీలను సమానంగా గౌరవిస్తూ దళిత్ అనే పదం అంటుంటాం. ఇక ముందు ఆ పదం వాడొద్దు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశం జారీ చేసింది. దళిత్ అంటూ అధికారిక పత్రాల్లో పొందుపర్చడం సరికాదనే మాటను కేంద్రం స్పష్టం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో షెడ్యూల్ కులాల వారికి ఇచ్చే ధ్రువీకరణ పత్రాల్లో హరిజన్ అనే పదాన్ని వాడేవారు. తర్వాతి కాలంలో ఆ పదాన్ని వాడకూడదని నిర్ణయించారు. ఆ మాటను మాట్లాడడం తప్పు అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు దళిత్ అనే మాట కూడా వాడొద్దని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దళిత్ అనే పదం వాడకం సరికాదంటూ ఇటీవల గ్వాలియర్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు అనుగుణంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రభుత్వ వ్యవహారాల్లో షెడ్యూల్ కులాల్ని ప్రస్తావించేప్పుడు దళిత్ అనే మాటను వాడకూడదు. షెడ్యూల్ కులాలు అని లేదా జాతీయ భాషల్లో అందుకు సరిపోయేలా.. అదే అర్థాన్ని ఇచ్చే మరో పదాన్ని వాడాలని తేల్చి చెప్పింది. ధ్రువీకరణ పత్రాల్లోనూ.. సర్టిఫికేట్లలోనూ షెడ్యూల్ క్యాస్ట్స్ లేదంటే అందుకు సరిగ్గా సరిపోయే పదాన్ని వాడాలని నిర్ణయించారు.