అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట కల్పించింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కలిసొచ్చింది. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి లైన్ క్లియరైంది. పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్ను శుక్రవారం (ఫిబ్రవరి 23) సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కాళేశ్వరానికి పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ.. హయతుద్దీన్ అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాదనలు విన్న కోర్టు.. చెన్నై బెంచ్ నుంచి ఢిల్లీకి ఎందుకొచ్చారని పిటిషనర్ను ప్రశ్నించింది. నిర్ణీత సమయంలో కోర్టుకు ఎందుకు హాజరు కాలేదని నిలదీయడంతో పిటీషనర్ సైలెంట్గా ఉండిపోయారు. దీంతో కోర్టు ప్రాజెక్టుకు అనుమతులు కరేక్టేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ పిటిషన్ను కొట్టివేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టు కేసు కొట్టేయడంపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీలో వాదనలను స్వయంగా విన్నహరీశ్రావు ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రైతుల న్యాయం, ధర్మం గెలిచిందని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అందులో భాగంగా వంద కేసులు వేసిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. పిటిషన్ వేసిందెవరో.. వాళ్లను నడిపిస్తున్నది ఎవరో త్వరలోనే బయటపెడతామని వెల్లడించారు. కోటి ఎకరాలకు నీరు అందించి.. ఆకుపచ్చ తెలంగాణ, ఆత్మహత్యలు లేని తెలంగాణ చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని గుర్తుచేశారు. కోదండరాం, కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టుల విషయంలో తమ ఆలోచనలను మార్చుకోవాలని సూచించారు. సుప్రీం తీర్పును స్వయంగా సీఎం కేసీఆర్కు ఫోన్ చేసి తెలిపారు.