కిడ్నీ సమస్యలు..రోజురోజుకు ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి పది మందిలో కనీసం ఇద్దరు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నట్లు గణాంకాలు చెబుతుండగా మారుతున్న జీవనశైలీ, ఆహారపు అలవాట్లే కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారడానికి కారణం అవుతోంది.
కిడ్నీ సమస్యలను ప్రారంభ దశలో గుర్తించడం కష్టమే కావొచ్చు కాని కొన్ని లక్షణాలను గమనిస్తే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మూత్రం సరిగా రాకపోవడం,మొఖంపై వాపు, ఆయాసం వంటి సాధారణ సమస్యలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే నడుం నొప్పి, మూత్ర విసర్జనలో మంట కిడ్నీ సంబంధిత వ్యాధుల లక్షణాలు.
కిడ్నీలు మానవ శరీంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలదే కీలకపాత్ర. అందుకే కిడ్నీల పనితీరు మందగిస్తే అది చివరకు డయాలసిస్కు దారి తీసే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ప్రధానంగా నీటిని అధికంగా తాగాలి. సి విటమిన్ కలిగిన పండ్లతో పాటు కాల్షియన్ని ఇచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా తినాలి. మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ శాతం పెరిగి కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. అలాగే తినే ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడితే కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అదుకే ఆహారపు అలవాట్ల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించడం ఎంతోమేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.