చిత్తూరు ఎంపీ సినీనటుడు శివప్రసాద్ వివాదాల్లో ఇరుకున్నారు.. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఎంపీ శివప్రసాద్ వ్యవహరించారని ఆరోపిస్తూ ట్రాన్స్ జెండర్స్ అసోషియేషన్ ప్రతినిధి తమన్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన పై కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని…పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యాలని పలురాజకీయ పార్టీలు వివిధ రూపాలలో నిరసన గళం విప్పుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.స్వతహాగా నటుడు అయిన ఆయన తన వేషధారణలతో అందరి దృష్టిని ఆకర్షించారు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ట్రాన్స్ జెండర్ వేషం వేసిన శివప్రసాద్ ఇబ్బందుల్లో పడ్డారు. ‘మోదీ బాయా’ అంటూ పాటలు పాడుతూ శివప్రసాద్ తమ మనోభావాలను దెబ్బతీశారని ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా తెలిపారు.
ఈ వ్యవహారంపై విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తన చేష్టలు, మాటలతో శివప్రసాద్ ట్రాన్స్ జెండర్ల మనోభావాలను దెబ్బతీశారని తమన్నా ఆరోపించారు. ఆపరేషన్లు చేసుకుని మహిళలుగా మారిన తమను శివప్రసాద్ తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకంగా ప్రవర్తించినందుకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.