లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయించే శ్రీవారి సేవా టిక్కెట్లను దారి మళ్లించింది ఇంటి దొంగే. సేవా టికెట్ల కుంబకోణంలో కీలకంగా వ్యవహరించిన టీటీడీ కాల్ సెంటర్ ఉద్యోగి శ్రీనివాసులును విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
శ్రీవారి సేవా టికెట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన శ్రీనివాసులు లక్కీడీప్లో అక్రమంగా దాదాపు 1,000 సుప్రభాత సేవ టికెట్లు పొందినట్టు అధికారులు గుర్తించారు. ఒక్కో టిక్కెట్ను రూ.2,500 నుంచి రూ.4 వేలకు అమ్ముకున్నట్టు దర్యాప్తులో తేలింది. అంతేకాదు, ఈ వారంలోనూ మరో 16 సేవా టికెట్లను దక్కించుకున్నట్లు తేలింది.
వాస్తవానికి శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్ లైన్ లాటరీ ద్వారా పారదర్శకంగా అందుతాయి. కానీ కొందరు మాయగాళ్లు నకిలీ ఆధార్లతో ఆర్జిత సేవా టిక్కెట్లు పొంది సొమ్ము చేసుకుంటున్నారు. స్వామి వారి సుప్రభాతం సేవకు ఒకరి స్థానంలో మరొకరు హాజరవుతుండటంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు అనుమానించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది.టీటీడీలో సేవా టికెట్ల కుంభకోణంపై గత మూడు నెలల నుంచి విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజాగా అధికారుల విచారణలో నకిలీ ఓటర్ కార్డుల ద్వారా లక్కీడిప్ లో శ్రీనివాసులు వెయ్యికిపైగా సుప్రభాత సేవ టికెట్లను అక్రమంగా పొందినట్లు తేలింది. గత నాలుగేళ్లుగా శ్రీనివాసులు ఇలా నకిలీ ఓటర్ కార్డులతో శ్రీవారి సేవా టికెట్లను తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.