ఇటీవల సైబరాబాద్ పోలీసులు ఎంతో యాక్టివ్ అయ్యారో చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ రూల్స్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం మీమ్స్ తయారుచేసి వదులుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ హడావుడి అంతా ఇంతా కాదు. పది వాక్యాల్లో చెప్పే విషయాన్ని చిన్న మీమ్ ద్వారా చెప్పొచ్చు. అది కూడా ఎంతో ఫన్నీగా.. నెటిజన్లకు అర్థమయ్యేలా వివరించవచ్చు. దీంతో రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఇటీవల అమేజాన్ ప్రైమ్లో నారప్ప సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నది. దీంతో ఈ సినిమాలోని ఓ సన్నివేశంతో మీమ్ క్రియేట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. ‘ఒక్క విషయం చెబుతా గుర్తుపెట్టుకో సిన్నప్పా. మాస్కు పెట్టుకో సిన్నప్పా. ఇంకా కరోనా పోలేదు సిన్నప్ప’ అంటూ ఓ మీమ్ను తయారుచేశారు సైబరాబాద్ పోలీసులు. ఇక ఈ మీమ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
సైబరాబాద్ పోలీసులు ఎంతో సున్నితంగా మాస్కు పెట్టుకోవాలన్న విషయాన్ని చేరవేశారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఓ పోస్టర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో రామ్చరణ్, తారక్ హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తుంటారు. ఈ పిక్ను కూడా సైబరాబాద్ పోలీసులు వాడుకున్నారు. వాళ్లు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని.. మీరూ అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే యమపురికి పోతారంటూ హెచ్చరించారు. ఇలా ప్రతి సినిమాను, సినిమా పోస్టర్ను సైతం సైబరాబాద్ పోలీసులు వాడుకుంటూ.. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆకట్టుకుంటున్నారు.