జగిత్యాలలోని ఎస్టీ సంక్షేమ బాలుర హాస్టల్లో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి విద్యార్థులను చీపురుతో చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.హాస్టల్లో కూరగాయలు కోసే పనులు చేసే శ్రీనివాస్ అనే వ్యక్తి, విద్యార్థులపై దాడి చేసినట్లు సమాచారం. చిన్నపిల్లలపై ఇలా హింసాత్మకంగా ప్రవర్తించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
శ్రీనివాస్ రోజూ మద్యం మత్తులోనే విధులకు హాజరవుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితి వల్ల హాస్టల్లో క్రమశిక్షణ దెబ్బతింటోందని, విద్యార్థుల భద్రత ప్రమాదంలో పడుతోందని తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్నాడని తెలుస్తోంది. మాటలు వినకపోతే చీపురుతో కొట్టడం, భయపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని బాధితులు చెబుతున్నారు.ఈ వ్యవహారంపై హాస్టల్ వార్డెన్ పలుమార్లు శ్రీనివాస్ను మందలించినప్పటికీ, అతని ప్రవర్తనలో మార్పు రాలేదని సమాచారం. అయినప్పటికీ, తగిన చర్యలు ఆలస్యంగా తీసుకోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చివరకు ఈ ఘటనపై ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్కుమార్కు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. దీనిపై అధికారులు స్పందించి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యుడైన శ్రీనివాస్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి లోటు ఉండదని హామీ ఇచ్చారు.
