వైఎస్ జగన్పై కత్తితో దాడి చేసిన కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. కేసును దర్యాప్తుకు సంబంధించి ఆధారాలను విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. జగన్ పై దాడికి కోడి పందాలుకు ఉపయోగించిన కత్తిని వాడాడని తెలిపారు. నిందితుడి దగ్గర మరో చిన్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
దాడికి సంబంధించి పలు ఆధారాలను సేకరించామని చెప్పారు. జగన్ ను కలవడానికి శ్రీనివాస్ గతంలో కూడా ప్రయత్నించి విఫలమయ్యాడని తెలిపారు. ఎయిర్ పోర్ట్ లోని రెస్టారెంట్ యజమానికి కూడా నోటీసులు ఇచ్చామని తెలిపారు.
దాడికి వాడిన కత్తి పొడవు 8సెం.మీలు ఉండగా ఆ కత్తిలో వాడిగా ఉన్న భాగం మూడు సెం.మీలేనని సీపీ వివరించారు. దాంతో పాటు ఘటనా స్థలంలో మరో చిన్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితుడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని అతడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.
గత ఏడాది కాలంలో శ్రీనివాస్ ఒకే సిమ్ తో 9 ఫోన్లను మార్చినట్లు తెలిపారు. 11 పేజీల లేఖపై శ్రీనివాసరావును ప్రశ్నించామని… 9 పేజీలను సోదరి వరసైన విజయలక్ష్మితో రాయించాడని, మరో పేజీని అదే రెస్టారెంట్ లో పని చేస్తున్న అటెండర్ రేవతిపతితో రాయించాడని… చివరి పేజీని జగన్ ను కలిసే ముందు హడావుడిగా రాశాడని చెప్పారు.