వైసీపీ అధినేత జగన్ పై గురువారం విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే వ్యక్తి కోడికి కత్తితో దాడి చేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ దాడిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అయితే దాడి చేసిన శ్రీనివాస్ వెనుక ఉన్న నేర చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
జగన్ పై కోడిపందాలకు వాడే కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావుపై గతంలోనే కొన్ని పోలీసు కేసులు నమోదయ్యాయి. ఠాణేలంకలో పదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్నాడు. గత సంవత్సరం కాగిత వెంకటేశ్ అనే యువకుడిపై దాడి చేశాడని ముమ్మిడివరం పోలీసు స్టేషన్ లో ఓ కేసు నమోదై ఉంది. ఇక శ్రీనివాసరావుకు గ్రామంలోని పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. వివాహేతర సంబంధాలపై గ్రామస్తులు శ్రీనివాస్ను మందలించినట్లు తెలుస్తోంది.
పక్కాప్లాన్ ప్రకారం జగన్పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం నిందితుడు కోడి పందేలకు వాడే కత్తిని ఓ తయారీదారు నుంచి కొనుగోలు చేసినట్లు స్థానికుడొకరు చెబుతున్నారు. తయారీదారుడు ‘ఇప్పుడు కోడి పందేలు ఏమీ లేవు. పైగా నువ్వు కోడి పందేలు ఆడవు. ఈ కత్తి నీకెందుకు?’ అని ప్రశ్నించాడని చెబుతున్నారు. దీనికి శ్రీనివాసరావు స్పందిస్తూ.. ‘నాకు ప్రత్యేకంగా పని ఉందిలే’ అంటూ తీసుకెళ్లాడని వెల్లడించారు.
సుమారు నెల కిందట కోడి కత్తి తయారీదారుడు, జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు మధ్య జరిగిన సంభాషణను స్థానికులు గుర్తు చేస్తున్నారు. దీన్నిబట్టి పక్కా ప్రణాళికతోనే శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు కొన్నాళ్ల కిందట శ్రీనివాసరావు సోదరుని కుమార్తె పుట్టినరోజు పండుగను ఆ కుటుంబం ఘనంగా నిర్వహించింది.
ఇదే సమయంలో స్నేహితులకు గ్రాండ్గా పార్టీ ఇచ్చినట్లు సమాచారం. ఆర్థికంగా అంత బలంగా లేకపోయినా శ్రీనివాసరావు భారీగా ఖర్చు చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పై దాడిలో కుట్ర కోణం దాగుందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్పై దాడికి శ్రీనివాసరావును ఎంపిక చేసుకున్నట్లు, భారీగా డబ్బులు ఇచ్చినట్లు స్పష్టమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.