శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు శుక్రవారం (సెప్టెంబరు 28) తీర్పు ప్రకటించింది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. వారి శారీరక సమస్యలను సాకుగా చూపి రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతి నిరాకరిస్తూ గతంలో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఆదేశాలిచ్చింది. వాటిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు సభ్యులు మహిళలకు శబరిమలలోకి ప్రవేశం కల్పించాలని తీర్పు చెప్పారు. మరో న్యాయమూర్తి విభేధించారు.
మహిళల భక్తికి అయ్యప్పను దూరం చేయరాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. రుతుస్రావం సాకుగా చూపి, మహిళలను దేవుడికి దూరం పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది.
భారత రాజ్యాంగంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉన్నాయన్న విషయాన్ని మరువరాదని, అయితే, భక్తుల మనోభావాల కోణం నుంచి కూడా కేసును పరిశీలించామని, అయితే, భగవంతుడు ఎక్కడున్నా ఒకటే అని చెప్పుకుంటున్న వేళ, మిగతా అయ్యప్ప దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై లేని ఆంక్షలు, శబరిమలలో ఉండరాదని పేర్కొంది.