మరికొన్ని రోజుల్లో ఎన్నికలు. ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉన్నట్టుండి జగన్ ఎందుకు ఢిల్లీ వెళుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చాలా కాలం నుంచే పక్కా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు జగన్. ఇప్పటికే పాదయాత్ర ముగించారు. పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాలకు మరికొన్ని రోజుల్లో చుట్టేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఉన్నట్టుండి జగన్ ఢిల్లీ టూర్కు ఎందుకు వెళుతున్నారు? అనేది ప్రశ్న.
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా చంద్రబాబు ఈ నెల 11న ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు. ఈ దీక్షకు పార్టీ శ్రేణులంతా రావాల్సిందేనని ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి కీలక తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటన అత్యంత ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీలో జగన్ ఎవరితో భేటీ అవుతున్నారు? ఎవరేవరితో మంతనాలు జరుపుతారన్న దానిపై ఇప్పటికే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటికే పొత్తుల విషయంలో జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తులు ఉండవన్నారు. కాబట్టి ఈ వ్యవహారంపై భేటీలు ఉండవు. మరి ఇంకేందుకు జగన్ ఢిల్లీకి వెళుతున్నారనే విషయం అర్థం కావడం లేదు.
కానీ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ మాత్రం ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో సర్క్యూలేట్ అవుతోంది. ఈ మధ్య ఏపీలోని పలు జిల్లాల్లో సర్వేల పేరుతో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి విజయనగరం జిల్లాలో ట్యాబ్లు చేతపట్టుకొని తిరుగుతున్న పలువురిని పోలీసులకు అప్పగించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ సర్వే వెనుక చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ హస్తమున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ సర్వే సంస్థతో నారా లోకేశ్ ఒప్పందం చేసుకున్నారని… ఆ ఒప్పందం మేరకే సదరు సర్వే బృందం వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా పావులు కదుపుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. అయితే జగన్ తన ఢిల్లీ టూర్లోనూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్లు సమాచారం. ఓట్ల తొలగింపులో లోకేశ్ పై ఫిర్యాదు చేసేందుకే జగన్ ఈ ఢిల్లీ వెళుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.