లోక్సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలని వైసీపీ, టీడీపీ ఎంపీలు కొద్ది రోజులుగా ఆందోళ చేస్తున్నారు. ప్రతిరోజు సభ ఏదో ఒక వంకతో వాయిదా పడుతూ వస్తోంది. టీడీపీ ఎంపీ శివప్రసాద్ రోసుకొక వేషంతో పార్లమెంట్ ముందు నిరసన తెలుపుతున్నారు. తాజాగా శివప్రసాద్, చంద్రబాబుపై ఆసక్తికర కామెంట్ష్ చేశారు వైసీపీనేత అంబటి రాంబాబు.
రోజుకో రకం వేషంతో మేకప్ వేసుకుని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్ కు వస్తుంటే, చంద్రబాబునాయుడు మేకప్ వేసుకోకుండా రోజుకో వేషం వేస్తూ, పూటకో మాట మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఒక్క మేకప్ విషయంలో తప్ప శివప్రసాద్, చంద్రబాబులది ఒకే వైఖరని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారని, దేశ రాజకీయాల్లో నంబర్ వన్ ద్రోహి చంద్రబాబేనని ఆరోపించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కబోవని హెచ్చరించారు. పాత మిత్రులు దూరం కావడంతో ఏమీ తోచని స్థితిలో ఉన్న చంద్రబాబు, కొత్త పొత్తుల కోసం వెంపర్లాడుతూ, కాంగ్రెస్ తో కలసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.